జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) ప్రశ్నపత్ర స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య అందాలంటే బోధన వృత్తిపై ఆసక్తి ఉన్నవారే ఉపాధ్యాయులుగా మారాలని, వారు ప్రతిభావంతులై ఉండాలని.. ఈ మేరకు ఎంపిక విధానంలో మార్పులు చేస్తామని జాతీయ విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ క్రమంలో వచ్చే డిసెంబరు లేదా జనవరిలో నిర్వహించనున్న సీటెట్ను ఆన్లైన్ విధానంలో జరపాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. అంతేకాకుండా జ్ఞాపకశక్తికి సంబంధించిన ప్రశ్నలను తగ్గించి ఆయా భావనలపై అవగాహన, సమస్యలను పరిష్కరించే నేర్పు, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్లపై ప్రశ్నలు ఎక్కువగా ఇస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. ప్రధానంగా సబ్జెక్టుపై అవగాహన, బోధించే విధానాలపై పరిజ్ఞానాన్ని పరిశీలించడం, ఆయా బోధన ఉపకరణాల వినియోగంపై పట్టు తదితర అంశాలపై దృష్టి పెట్టి అభ్యర్థిని అంచనా వేస్తామని తెలిపింది. దీనిపై త్వరలో బ్లూ ప్రింట్తోపాటు మాదిరి ప్రశ్నలను విడుదల చేయనుంది.
జిల్లాల్లో నమూనా పరీక్షలు
ఆన్లైన్ విధానంలో తొలిసారిగా పరీక్ష జరపనున్నారు. అందుకు ఉచితంగా ఆన్లైన్ నమూనా పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వాటి నిర్వహణకు జిల్లాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు నెలకొల్పుతారు. దేశవ్యాప్తంగా సీటెట్ను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుండగా.. ఒక్కోసారి దాదాపు 28 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. నవోదయ, ఆర్మీ విద్యాలయాలు ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు సీటెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. రాష్ట్రంలో జరిగే ఉపాధ్యాయ నియామకాలకూ దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
Post a Comment
0 Comments